బ్లాక్ మార్కెట్లో విక్రయాలు
సాక్షి, నరసరావుపేట : పల్నాడు జిల్లా వ్యాప్తంగా డీజల్, పెట్రోల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం, జిల్లా అధికారులు ఇంధన కొరత లేదంటూ పదే పదే ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంధన కొరత వేధిస్తోంది. ముఖ్యంగా రైతులు, ఆటో, లారీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంట కోత కోయాలంటే రైతుల తల ప్రాణం తోకకు వస్తోంది. గతంలో కేవలం బాడుగ ఇస్తే యంత్రాలు వచ్చి కోత కోసి వెళ్లేవి. మూడు రోజులుగా బాడుగతోపాటు కోతకు అవసరమైన ఇంధన రైతే తెచ్చుకోవాలంటూ నిబంధనలు పెడుతున్నారు. దీంతో రైతులు క్యాన్లు తీసుకొని పెట్రోల్ బంకుల చూట్టూ తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో రైతులకు క్యాన్లలో ఇంధనం నింపడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు చేసేదేమీలేక కోతలను వాయిదా వేస్తున్నారు. మరికొందరు బ్లాక్లో డీజల్ కొనుగోలు చేసి కోతలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందిపడుతుంటే ఈ అదనపు ఖర్చుతో మరింత రైతు నష్టపోయే ప్రమాదముందంటున్నారు.
ఆగని ఇంధన కష్టాలు
సత్తెనపల్లి: నరసరావుపేటకు చెందిన ఓ విద్యార్థిని గుంటూరులో నీట్కు ప్రిపేర్ అవుతోంది. సోమవారం నీట్ ప్రిపరేషన్ పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. డీజిల్ కొరత కారణంగా రాలేనని క్యాబ్ నిర్వాహకుడు సమాధానం చెప్పాడు. చివరకు ఆ విద్యార్థిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది.
జిల్లా వ్యాప్తంగా 195 డీజల్, పెట్రోల్ బంకులు ఉండగా సుమారు 70కి పైగా బంకుల్లో ఆయిల్ సరఫరా సక్రమంగా చేయడం లేదు. మిగిలిన వాటిలో అరకొరగా వినియోగదారులకు నింపి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. బంక్ తెరిచారన్న సమాచారం రాగానే క్షణాల్లో వాహనదారులు వాలిపోతున్నారు. ఏ బంక్లో చూసినా వందలాది వాహనాలు క్యూ కట్టి దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తున్న యాత్రికులు వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బంకుల్లో ఆయిల్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా అధికారులు మండలాలకు ప్రత్యేకాధికారులుగా వెళ్లినా వారు ఉన్న కాసేపు అరకొరగా ఇంధనం నింపి వెళ్లిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా లేని ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపిస్తున్నారు.


