కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్
లక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో దళితుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ, తన అనుచరులతో దళిత యువతను రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించిన ఉండి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వైఖరిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పెద్దపేటలో అసలు ఏం జరిగిందో, దళిత యువతపై ఏరకంగా దాడులు జరిగాయో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రఘురామకృష్ణంరాజు చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు చేయడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే కనీసం విచారణ చేయకుండా ఏకపక్షంగా మాట్లాడటం రాష్ట్రానికి హానికరం అని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న రఘురామకృష్ణంరాజును పదవి నుండి తొలగించని పక్షంలో దళిత ప్రజాసంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
గోవాడ ప్రాశస్త్యాన్ని కాపాడుకుందాం
తెనాలిటౌన్: వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం గోవాడ తిరునాళ్ల ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి దగ్గరలోని గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఈ తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. ఆలయ సమీపంలోని గోవాడ నుంచి కావూరు డొంకలో ఉత్సవం కోసం నిర్దేశించిన స్థలంలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ వారికి స్థలం అప్పగించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1943 నుంచి అనేకసార్లు ఈ స్థలాన్ని వేరేవారికి కేటాయించగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకుని కేటాయింపులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, తహసీల్దార్ ఈ స్థలం కేటాయింపునకు ప్రాధాన్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తుమ్మల జగదీష్, మండవ మల్లీశ్వరి, కెవి సత్యనారాయణ, వేదాంతం ఫణీంద్ర, కె.వాసుదేవనాయుడు, కడియాల నంద కిషోర్, బసవపున్నయ్య, ఆర్.శివశంకరరావు, రాజేష్ పాల్గొన్నారు.


