సత్తెనపల్లి: ప్రపంచ గమనాన్ని గణితం మార్చిందని ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యుడు పెద్దింటి వెంకట కోటేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ గణిత వేదిక (ఏపీఎమ్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. గణితం లేనిదే ప్రపంచ ప్రగతి లేదన్నారు. ప్రతి విద్యార్థి గణితంపై ఆసక్తి పెంచుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. దైనందిన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి గణితం పాత్ర ఎక్కువ అన్నారు. గణితం ఒక వేగం, గణితంతో స్నేహం ఒక అపూర్వ అనుభవమన్నారు. గణితం పై ఆసక్తిని పెంచుకునేందుకు మ్యాథ్స్ ఫోరం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఏపీఎమ్ఎఫ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. ముందుగా సమావేశ పరిచయకర్తగా సత్యనారాయణరాజు వ్యవహరించారు. కందిమళ్ల వేణుగోపాల్ ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకన విధివిధానాలపై కీలక సూచనలు చేయగా, భాగేశ్వరి విద్యార్థుల పేపర్ ప్రజెంటేషన్ మెరుగుపరుచుకునే విధానాలను వివరించారు. తాత సాంబశివరావు గణిత బోధనా పరికరాల తయారీపై ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఏపీఎమ్ఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.మల్లికార్జునరెడ్డి గణిత ఉపాధ్యాయుల నైపుణ్యాల పెంపకం, గణిత సబ్జెక్టు అభివృద్ధికి మ్యాథ్స్ ఫోరం చేస్తున్న కృషిని వివరించారు. మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి దుర్గారావు పల్నాడు జిల్లా శాఖ కృషిని వివరించారు. సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత బాలు గణిత శాస్త్రవేత్తలపై రూపొందించిన ఆడియో విజువల్ ప్రదర్శించి అభినందించారు. ప్రశాంతబాలుకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించారు. జాతీయ స్థాయి యోగా విజేతగా నిలిచిన ఉపాధ్యాయుడు ఎం రమేష్ దంపతులను, గణిత సేవలో విశేష కృషి చేసిన వీరబ్రహ్మం, వేణుగోపాల్, భాగేశ్వరిలను సన్మానించారు. ఏపీఎమ్ఎఫ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గాన్ని, జిల్లా అడ్వైయిజరీ కమిటీలను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గణిత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


