ప్రజా సమస్యలపై పట్టింపు ఏదీ?
నరసరావుపేట: అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య ఆదిపత్య పోరు, పదవుల పోరాటం, అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లోని నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీల ప్రతినిధిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీడీపీ ఎంపీగా పోటీచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ అరవిందబాబుకు టికెట్ ఇచ్చేందుకు తన విముఖుత వ్యక్తం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల అనంతరం కూడా వారిద్దరి మధ్య పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి.
అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి. రెండేళ్ల నుంచి నియోజకవర్గం నుంచి కొనసాగే నకరికల్లు–చీరాల ఓడరేవు బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టించలేకపోయారు. పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. పురపాలక సంఘంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏరులై పారుతుంది. ఈ ప్రభుత్వంలో అధికారుల లంచాలు తీసుకోవడం తప్పితే తమకు కూటమి ప్రభుత్వంలో ఒరిగిందేమిలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ పూర్తిగా వెనుతిరిగి నడుస్తుంది.
ఇక జేపీలో అంతర్గత కుమ్ములాట నడుస్తుంది. గత ఎన్నికల నాటికి నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన రంగిశెట్టి రామకృష్ణ, ప్రస్తుత అధ్యక్షులు ఏలూరి శశికుమార్ వర్గీయుల మధ్య నిప్పులేకుండానే పొగ వస్తుంది. ఇటీవల రామకృష్ణ కాపు కుల సంఘ సమావేశంలో తన కులస్తులపైనే కొన్ని విమర్శలు చేయటం, ఆ విమర్శలతో బీజేపీకి ఏమీ సంబంధం లేదని, అతని వ్యక్తిగతమంటూ బీజేపీ నాయకులు ప్రెస్మీట్ పెట్టి చెప్పటం గమనించాల్సిన అంశం. దీనిపై రామకృష్ణ వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని వాట్స్ప్లలో వ్యతిరేక ప్రచారం చేయటంతో ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాట తేటతెల్లమౌతుంది.


