ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భక్తులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. తెనాలి చెంచుపేటకు చెందిన మాదాల నాగరాజా కుమారి, భానుప్రసాద్లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
పిడుగురాళ్ల: పట్టణంలోని నాగుల గుడిలో షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవం, కావడి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రేపల్లె: పట్టణంలోని ఓల్డ్ టౌన్లో వేంచేసియున్న గ్రామదేవత బూరగలమ్మ వారికి పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు, బాలాజీ గురుకులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు, రజత వస్త్రాలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో నిత్య హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.


