ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్ మాత వద్ద సెయింట్ ఆన్స్ సెంటినరీ ఇంగ్లిషు మీడియం పదవ తరగతి విద్యార్థులు ప్రార్థనలు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ కె.నిర్మల తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా దైవానుగ్రహం అందేలా ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాథ్యాయులు కె.అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలేరమ్మ తిరునాళ్ల
వేడుకలు
రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ 37వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజనరీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తిరునాళ్లకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామస్తులు విద్యుత్ ప్రభను నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రొంపిచర్ల పోలీసులు తిరునాళ్లలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
సాగర్ నీటి మట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 535.70 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 18,864 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 18,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


