జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
నరసరావుపేట: జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు కేఎల్ రావుసాగర్ (పులిచింతల ప్రాజెక్ట్) ప్రత్యేక కలెక్టర్గా పూర్తి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది.
శివాలయంలో కార్తికమాస ఏర్పాట్లపై సమీక్ష
పెదకాకాని: కార్తిక మాసం సందర్భంగా పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కార్తికమాస ఏర్పాట్లపై అర్చక స్వాములు, సిబ్బందితో శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు.
రెంటచింతల: క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు స్థానిక కానుకమాత చర్చి విచారణ గరువులు రెవ. ఫాదర్ వైఎల్ మర్రెడ్డి అన్నారు. శనివారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కానుకమాత కళావేదిక వద్ద క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకల సందర్భంగా సమిష్టి పవిత్ర పూజాబలికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు మహాఘన డా.చిన్నాబత్తిని భాగ్యయ్య నేతృత్వంలో సమిష్టి పవిత్ర పూజాబలి సమర్పించడం జరుగుతుందన్నారు. పల్నాడు డీనరి పరిధిలో ఉన్న 14 విచారణలకు సంబంధించిన ఫాదర్లు, కన్య సీ్త్రలు, భక్తులు పాల్గొంటారన్నారు.
గుంటూరుమెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి 420 హిస్టాలజీ స్లైడ్లు అందజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి స్లైడ్లను మణిపాల్ వైద్య విశ్వవిద్యాలయం నుంచి తెప్పించి, అనాటమీ విభాగానికి అందజేశారు. అనాటమీ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఈ హిస్టాలజీ స్లైడ్లు ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు, అనాటమీ పీజీ వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాక్టికల్ స్థాయిలో శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకునేలా సదుపాయాలు మెరుగుపరచడం మా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులు డాక్టర్ సుందరాచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ శ్రీధర్, అనాటమీ విభాగం సహా ఆచార్యులు, సహాయక ఆచార్యులు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాలి: చినరావూరులోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీసోమేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం నందీశ్వరునికి అభిషేకం చేశారు. ముందుగా అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ తదుపరి సోమేశ్వరునికి అభిషేకం, బాలాత్రిపురసుందరి దేవికి కుంకుమ అర్చన చేశారు. అనంతరం నందీశ్వరునికి అభిషేకం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పులిచింతల ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్గా సూరజ్ గనోరే