
నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ల పంపిణీ
సత్తెనపల్లి: జిల్లాలో సచివాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. వలంటీర్ విధులు తమకు వద్దని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిరసన తెలియ జేస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,72,735 పెన్షన్లకు గాను బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు 2,51,240 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. 92.12 శాతం పంపిణీ పూర్తయింది. ఇంకా 21,495 మందికి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా సత్తెనపల్లి పట్టణంలో 94.89 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేయగా అత్యల్పంగా దుర్గిలో 89 శాతం మందికి పంపిణీ జరిగింది. ఇది ఇలా ఉంటే రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీలో జరిగిన లోటుపాట్లపై లబ్ధిదారులు అంతా ఒకే చోటకు చేరి గంటల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడటంతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్డీఓ రాజగోపాల్, మండల అధికారులు అనుపాలెం గ్రామానికి చేరుకొని పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించారు.
నకరికల్లు: ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. మండలంలోని గుండ్లపల్లి సమీపంలోని ఎన్నెస్పీ మెయిన్ కెనాల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన విషయం పాఠకులకు విధితమే. చిలకలూరిపేటకు చెందిన షేక్ అర్షద్(17), చీరాల మండలం ఆంధ్ర కేసరినగర్కు చెందిన దరబడి మార్క్ రూఫస్(17)ల మృతదేహాలను మండలంలోని శివాపురంతండా సమీపంలో సాగర్ కెనాల్లో గుర్తించారు. అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. ఎస్ఐ కె.సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
యడ్లపాడు: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి క్వారీ కుంటలో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన దాసరిపాలెంకు చెందిన బాలుడు షేక్ మాబు(15) మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గతనెల 30వ తేదీన మండలం పరిధిలోని చౌడవరం గ్రామ శివారులోని క్వారీకుంటలో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన మాబు మృతదేహాన్ని యడ్లపాడు పోలీసులు అదేరోజు రాత్రి 10.45 వెలికి తీసిన విషయం తెలిసిందే. వెంటనే మృతదేహాన్ని చిలకలూరిపేట అర్బన్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. బుధవారం మాబు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాస్పిటల్ వద్దకు రావడంతో రోదనలు మిన్నంటాయి. తల్లి మరియంబి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం మాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో దాసరిపాలెంలోని అంత్యక్రియలు నిర్వహించారు.