
అర్జీల పరిష్కారంలో జాప్యం తగదు
నరసరావుపేట: ప్రజలు అందించిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధ్యక్షత వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళిలతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 91 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్లో 91 అర్జీలు స్వీకరించిన
కలెక్టర్ అరుణ్బాబు