
ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల విలువైన ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు డ్రంకెన్ డ్రైవ్, 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అతి వేగంగా ద్విచక్ర వాహనం నడిపే వారిపై, 18 నుంచి 24 వరకు హెల్మెట్ ధరించని వారిపై, 25 నుంచి 31వ తేదీ వరకు బ్లాక్ స్పాట్స్ వద్ద అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడే ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.
తల్లిపాలు బిడ్డ హక్కు
ప్రత్తిపాడు: తల్లిపాలు బిడ్డ హక్కు అని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎస్. జయలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడు పాలెం–2 అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎస్.జయలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలు శిశువు జీవితానికి రక్షణ అని, ఆరోగ్య భవితకు బలమైన పునాదని చెప్పారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లికి కూడా శారీరక, మానసిక ధృఢత్వం లభిస్తుందన్నారు. తదనంతరం కేంద్రంలో ప్రీస్కూల్ నిర్వహణ, రిజిస్టర్లును పరిశీలించారు. సీడీపీవో జి. విజయలక్ష్మి, ఏసీ డీపీవో సీహెచ్. విజయనిర్మల, సూపర్వైజర్లు ఎం.వీ రత్నం, ఎంఎల్హెచ్పి మేఘన, ఎంఎస్కె బి. సుశీల పాల్గొన్నారు.
ప్రత్తిపాడు మండలంలో..
ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండల స్థాయి అధికారులకు ఐసీడీఎస్ సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తహసీల్దార్ సుజాత, ఎంఈవో సీహెచ్. రమాదేవి, ఈవోపీఆర్డీ షేక్ ఆదంషఫీ, ఏవో సుగుణబేగంతో పాటు ఆయా శాఖల అధికారులు తల్లిపాల ఆవశ్యతను వివరించే కరపత్రాలు పోస్టర్లును ఆవిష్కరించారు.
కౌలు రైతులకు సుఖీభవ వర్తింప చేయాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో 60 నుండి 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని, వీరికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటే భూ యజమాని సంతకం కావాలనే నిబంధన వల్ల గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారన్నారు.

ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్