సేవల్లో ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ | - | Sakshi
Sakshi News home page

సేవల్లో ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’

May 31 2025 1:31 AM | Updated on May 31 2025 1:31 AM

సేవల్

సేవల్లో ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’

తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్‌ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. తెనాలి రూరల్‌ మండల గ్రామం సంగంజాగర్లమూడి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. తొలుత ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్‌సీ పరిధిలోని చందవరం సబ్‌ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్‌లో హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (మేల్‌)కు మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు.

పేద రోగులకు సేవలు

వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్‌లో ఉండగా, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ప్రాజెక్టుపై శుభావతిని నాటి జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్‌ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగానే అప్పటి రాష్ట్రమంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. ఎక్కడ పనిచేసినా తోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం తనకు గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. డబ్బు కోసం ఆశపడలేదు. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. జాతీయ అవార్డు లభించిందంటే వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను’ అని శుభావతి చెప్పారు.

రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కారం పొందిన ఏకై క మహిళ

ఎన్నో అవార్డులు.. రివార్డులు

ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై శుభావతి ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్‌ పర్సన్‌గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు కలెక్టర్ల నుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్‌ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ చేసిన సేవలకుగాను అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్‌, న్యూట్రిషన్‌పై శుభావతి రాసిన పాట పేరు పొందింది. ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోనూ ఏఎన్‌ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్‌ అవేర్‌నెస్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, కుమారుడు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక గుంటూరులోనే ఆమె స్థిరపడ్డారు.

సేవల్లో ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ 1
1/1

సేవల్లో ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement