
కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని వాటిని కూడా కూడా నెరవేర్చారని, దీనిని ప్రజలు గుర్తించారని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం 15 ఎకరాలలో ఉందని, కొత్త ఇంటిని రూ.కోట్లతో నిర్మిస్తున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలలో ఇల్ల్లు కడుతున్నారని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని హితవు పలికారు.
ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి
హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొని తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారన్నారు. మంగళగిరి, గుంటూరు తూర్పు, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు