– డీలర్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి హెచ్చరిక
నరసరావుపేట టౌన్: చౌక దుకాణ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. నారదముని శుక్రవారం హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నుంచి చౌక దుకాణాల వద్ద కార్డుదారులకు నిత్యావసరాల సరకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8–మధ్యాహ్నం 12, సాయంత్రం 4 – రాత్రి 8 గంటల వరకు చౌక దుకాణాలు తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పరమైన స్టాక్ బోర్డ్, కార్డుదారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరకుల వివరాలను డీలర్ అందుబాటులో ఉంచాలన్నారు.
చౌక దుకాణ పరిధిలోని వృద్ధులు, దివ్యాంగులకు ఆయా డీలర్లు ఇంటి వద్దకే వెళ్లి సరకులు అందించాలని పేర్కొన్నారు. నియమ నిబంధనలు, నిర్దేశించిన సమయాలను తప్పక పాటించాలన్నారు. పంపిణీ సమయంలో సంబంధిత సీఎస్డీటీ ఆయా చౌక దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలిస్తారన్నారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జవహర్ నవోదయ కోసం స్థల పరిశీలన
బల్లికురవ: కేంద్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విద్యాలయం ఏర్పాటుకు 25 ఎకరాల భూమి కావాల్సి ఉంది. బల్లికురవ తహసీల్దార్ రవినాయక్ వల్లాపల్లి గ్రామంలోని పేరంటాళ్ల తల్లి ఆలయం సమీపంలో, గుంటుపల్లి గ్రామంలోని సచివాలయం సమీపంలో భూములను పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ వివరించారు.
కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు
బాపట్ల: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా, దర్శకురాలుగా పనిచేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె కోన నీరజకి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం హైదరాబాదులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వెలుగొందడంతో పాటు పుస్తక రచయితగా, దర్శకురాలుగా ఆమె శక్తివంతమైన మహిళగా రూపుదిద్దుకుంటున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కొనియాడింది. ఈ సందర్భంగా కోన రఘుపతి తన కుమార్తెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ అవార్డు అందుకోవడం బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ యోగా సెంటర్లో సాధన చేశారు. యోగా ఆవశ్యకతను వీసీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి.సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి. వెంకటేశ్వర్లు, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె.మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్యతేజోమూర్తి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి రైల్వే గేటు మూసివేత
ఫిరంగిపురం: ఫిరంగిపురం – సత్తెనపల్లి మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి జూన్ 3వ తేదీ వరకు గేటు మూసి వేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహన దారులు వినియోగించుకోవాలన్నారు.

కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు