
నిందితుడు అరెస్ట్
చోరీలకు పాల్పడుతున్న
నరసరావుపేట రూరల్: తాళాలు వేసి ఉన్న గృహాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడిని అరెస్ట్చేసి అతని వద్ద నుంచి రూ.33.50లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరంకు చెందిన గోపిశెట్టి నాగమల్లేశ్వరరావు బెట్టింగ్తో పాటు చేడు వ్యసనాలకు బానిసై నేరాలకు అలవాటు పడ్డాడు. ఇతనిపై 2018 సంవత్సరంలో అద్దంకి పోలీస్ స్టేషన్లో హత్యకేసు నమోదైంది. దర్శి, గిద్దలూరు పోలీస్స్టేషన్లో హత్యకేసులు ఉన్నాయి. దీంతో పాటు పలు పోలీసు స్టేషన్ల్లో చోరీ కేసులూ ఉన్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి, పగలు తేడా లేకుండా చోరీలకు పాల్పడటంలో ఆరితేరాడు. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఉప్పలపాడు మెయిన్రోడ్డులోని ఇంటిలో చోరీకి పాల్పడి 350 గ్రాముల బంగారంతో పాటు వెండి దొంగిలించాడు. చోరీ చేసిన సొత్తును విక్రయించే ప్రయత్నంలో నరసరావుపేట మండలం రావిపాడు శివారులో పోలీసులు నాగమల్లేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడుతో పాటు పెట్లూరివారిపాలెం, పమిడిపాడు, వన్టౌన పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లాల్ హోటల్ వెనుక గృహంలో, చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెంలో చోరీకి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడి నుంచి 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో దర్యాప్తులో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.
రికవరీపై అనుమానాలు..!
చోరీ కేసులో పోలీసులు వెల్లడించిన బంగారం రికవరీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు పూర్తిస్థాయిలో బంగారాన్ని రికవరీ చేయలేదని తెలుస్తుంది. నిందితుడు నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు నరసరావుపేటలో బంగారం వ్యాపారం చేస్తున్న అధికారపార్టీ నాయకుడు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బంగారం రికవరీ కోసం పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వ్యాపారి అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయించాడు. ఒక ఎంపీతో పాటు ఎమ్మెల్యే వ్యాపారికి అండగా నిలవడంతో నామమాత్రంగా వ్యాపారి నుంచి పోలీసులు రికవరీ చేసినట్టు తెలుస్తుంది. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కూడా కేవలం ఉప్పలపాడులోనే 350 గ్రాములు బంగారం చోరీకి గురైనట్టు తెలిపారు. మిగిలిన నాలుగు కేసుల్లో ఎంత బంగారం నిందితుడు చోరీ చేసింది వెల్లడించక పోవడం అనుమానాలను తావిస్తుంది.
రూ. 33.50లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు స్వాధీనం తాళాలు వేసిన గృహాలే లక్ష్యంగా చోరీలు నరసరావుపేట, చిలకలూరిపేటల్లో ఐదు చోట్ల దొంగతనాలు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు