
ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
నరసరావుపేట ఈస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అరండల్పేటలోని సీపీఐ కార్యాలయంలో శనివారం నరసరావుపేట నియోజకవర్గ పట్టణ మహాసభ నిర్వహించారు. కార్యాలయం ఎదుట పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మహాసభలో మాట్లాడారు. కేంద్రంలో బిజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. నల్ల ధనాన్ని వెలికితీసి పేదలకు అందిస్తానని చెప్పిన మోదీ నేడు నల్ల చట్టాలను తీసుకవచ్చి రైతులు, కార్మికులను దారుణంగా మోసగించాడని తెలిపారు. మత రాజకీయాలు చేస్తూ ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను దారుణంగా మోసగిస్తున్నాడని విమర్శించారు. సూపర్సిక్స్తోపాటు ఎన్నో హామీలను గుప్పించి ఏడాది కాలం గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సీపీఐ పల్నాడుజిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదు, సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, నియోజకవర్గ కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, ఏఐటీయూసీ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, షేక్ చినజాన్సైదా పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు