భక్తుల సేవలో కోటప్పకొండ రెడ్ల సత్రం | - | Sakshi
Sakshi News home page

భక్తుల సేవలో కోటప్పకొండ రెడ్ల సత్రం

Jun 8 2025 1:27 AM | Updated on Jun 8 2025 1:27 AM

భక్తు

భక్తుల సేవలో కోటప్పకొండ రెడ్ల సత్రం

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండలో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెడ్ల సత్రం సిల్వర్‌ జూబ్లి ఉత్సవాలకు ముస్తాబైంది. పవిత్ర శైవక్షేత్రం కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శనానికి వచ్చే యాత్రికులకు సత్రంలో వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సత్రంలోని వృద్ధాశ్రమంలో కులాలకు అతీతంగా వృద్ధులు సేవలు పొందుతున్నారు. 25 సంవత్సరాల కాలంలో సత్రం అభివృద్ధిలో పయనిస్తూ భక్తులకు విశేష సేవలు అందిస్తోంది. కోటప్పకొండలోని శ్రీ యోగిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2001లో రెడ్ల సత్రం ప్రారంభమైంది. వెలుగోటి పిచ్చిరెడ్డి గౌరవ అధ్యక్షుడిగా, పల్లెల పిచ్చిరెడ్డి అధ్యక్షుడిగా 49 మంది సభ్యులతో సత్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దాతల సహకారంతో సత్రంలో నిత్యం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సత్రంలో ప్రస్తుతం 93 గదులను దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చారు. సత్రంలో సభ్యులుగా చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 49 మంది సభ్యులతో సత్రం ప్రారంభంకాగా నేడు 2287 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం సత్రం కమిటీ గౌరవ అధ్యక్షుడిగా భవనం రాఘవ రెడ్డి, అధ్యక్షుడిగా కంజుల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పొలిమేర వెంకట రెడ్డి, కోశాధికారిగా మాగులూరి సుబ్బారెడ్డిలు వ్యవహరిస్తున్నారు.

సత్రంలో వృద్ధాశ్రమం

సత్రంలోని గదులలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే యాత్రికులకు వసతి సౌకర్యంతో పాటు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీంతో పాటు సత్రంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. కులాలకు అతీతంగా వృద్ధులు ఇక్కడ సేవలు అందుకుంటున్నారు. దాదాపు 80 మంది వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉన్నారు. సత్రం కమిటీకి అనుబంధంగా నరసరావుపేట పట్టణంలో వినుకొండ రోడ్డులో రెడ్డి బాలుర హాస్టల్‌ నిర్వహించబడుతోంది. ఇక్కడ కులాలకు అతీతంగా పేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు హాస్టల్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు.

నేడు సిల్వర్‌ జూబ్లీ వేడుకలు

ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సత్రంలో సిల్వర్‌ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సత్రంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న భోజనశాల, గదులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.20 లక్షలతో ఏర్పాటు చేయనున్న లిప్ట్‌ పనులను ప్రారంభిస్తారు. దీంతో పాటు సత్రం అభివృద్ధికి కృషి చేసిన దాతలను ఘనంగా సత్కరించనున్నారు.

2001లో సత్రం ఏర్పాటు

సత్రం గదులలో యాత్రికులకు

వసతి, ఉచితంగా భోజనం

కులాలకు అతీతంగా వృద్ధాశ్రమం

నేడు సత్రం సిల్వర్‌జూబ్లీ వేడుకలు

భక్తుల సేవలో కోటప్పకొండ రెడ్ల సత్రం 1
1/1

భక్తుల సేవలో కోటప్పకొండ రెడ్ల సత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement