
ఆరోగ్యయోగం
యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో యోగా గురించిన అవగాహన పెరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ యోగా స్ఫూర్తి వికసించింది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ వేలమంది ఏకకాలంలో యోగా చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అర్ధగంట పాటు యోగాసనాల కోసం కేటాయించాలన్నారు. యోగా అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు గిన్నిస్ బుక్ రికార్డు సాధించే ప్రయత్నానికి ప్రజలు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా అధికారులు, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. –నరసరావుపేట