ప్రకృతి వనరులను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి

May 31 2025 1:37 AM | Updated on May 31 2025 4:28 PM

గుంటూరు వెస్ట్‌: ప్రకృతి పంచిన అరుదైన వనరులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేటివ్‌ రిజర్వ్‌గానూ, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగానూ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిని గ్రామ సభల ద్వారానూ సంబంధిత శాఖాధికారుల ద్వారా ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో డీపీఓ సాయి కుమార్‌, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈఈ నజీమా బేగం, అధికారులు పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్‌ జనరల్‌ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్‌ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. హైడాటిడ్‌ సిస్ట్‌ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. 

కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్‌ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్‌ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్‌కుమార్‌, సాదిక్‌ బాషా, వేణుగోపాల్‌, మేఘన, అవిన్‌, హరి, పోలయ్య, శ్యాంసన్‌, శ్వేత, ప్రసాద్‌, హనుమంతరావు, నర్సింగ్‌ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ అభినందించారు.

పోలీసులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌

తెనాలి రూరల్‌: లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నిరాటంకంగా అమలు చేస్తూ దళిత, మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన సీఐలు, ఇతర పోలీసు సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అందే శ్యాం డిమాండ్‌ చేశారు. తెనాలి ఐతానగర్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఐతానగర్‌ దళితులు క్రిమినల్‌, గంజాయి కేసుల్లో ఉన్నందున పోలీసులు బహిరంగంగా ట్రీట్మెంట్‌ ఇవ్వడం సరైందేనని అధికార పార్టీ పత్రికల ద్వారా, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి 1
1/1

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement