
క్యూఆర్ కోడ్తో జనాభా నిర్వహణపై ప్రజాభిప్రాయం
నరసరావుపేట: జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈనెల ఒకటి నుంచి 20వ తేదీ వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అర్ధగణాంకశాఖ అధికారి మాలతి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం క్యూఆర్ కోడ్ పోస్టర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని కుటుంబాల నుంచి జనాభా నిర్వాహణ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించాలని ఆదేశించారు. దీనిలో జేసీ సూరజ్ గనోరే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేడు నాగార్జున సాగర్లో సామూహిక యోగా
నరసరావుపేట: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోట, జూన్ 18న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
చిట్ఫండ్ యజమానికి బెయిల్ మంజూరు
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్టు మంగళవారం చిట్ ఫండ్ యజమానికి బెయిల్ మంజూరు చేసింది. పాలడుగు పుల్లారావు సాయిసాధన చిట్ఫండ్ కంపెనీ నడుపుతూ రూ.కోట్లు స్కామ్ చేసి ప్రజలను మోసం చేశాడనే అభియోగంపై అరెస్టయ్యాడు. దీనిపై నరసరావుపేట–1 టౌన్ సిట్ సీఐడీ వారు కేసు నమోదు చేశారు. ఇరువురి హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
తెనాలి: తెనాలికి చెందిన కవి, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. విజయవాడకు చెందిన ‘తెలుగు కళారత్నాలు’ సాంస్కతిక సేవా సంస్థచే సోమవారం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 10 గంటలపాటు జరిగిన సకల కళాప్రదర్శనలో నాగేశ్వరరావు సాహిత్య ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రం, మెడల్ను ఏపీ సచివాలయం ఓఎస్డీ డాక్టర్ ప్రభాకర్, విశ్రాంత ఆదాయ పన్ను అధికారి డాక్టర్ పతంగి చెన్నయ్య, ప్రముఖ రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవి సమక్షంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యూవీ రత్నం అందజేశారు.