
కూటమి దగా.. రైతులపై పగ
ఎన్నికల సమయంలో కూటమి తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు అందించాలి. పల్నాడు జిల్లాలో 2,80,181 మందికి ఇప్పటికే ఏడాదికి రూ.560.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు ఆ దిశగా కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీంతో అప్పులు చేస్తూ ఖరీఫ్ సాగుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
నరసరావుపేట రూరల్: ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు పెట్టుబడి కోసం రైతు భరోసా పథకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అధికారం చెపట్టిన మొదటి సంవత్సరమే రైతులకు పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు వారి ఖాతాల్లో నగదు జమ అయింది. తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిపోయారు. ఏడాది గడిచినా ఎప్పుడిస్తారో కనీసం ఊసే లేదు. ఖరీఫ్ ప్రారంభమవుతున్న దృష్ట్యా పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో పెట్టుబడి సాయం కోసం 2,80,181 మంది రైతులు ఎదురుచూస్తున్నారు. రూ.20 వేల చొప్పున సర్కారు చెల్లించాల్సి ఉంది. రెండో ఏడాదిలో ఖరీఫ్ ప్రారంభం అవుతున్నప్పటికీ గతేడాది సాయం ఇంకా మంజూరు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
నాడు మూడు విడతల్లో నిధులు
వైఎస్ జగన్ సర్కారు ఖరీఫ్ సాగుకు ముందే ఏటా మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడతలో రూ.7,500 అందించింది. తర్వాత అక్టోబర్ నెలలో పంట కోతతోపాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు, జనవరి నెలలో ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు.. ఇలా మొత్తం రూ.13,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. కూటమి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. విత్తనాలు, ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక ధరకు కొనుగోలు చేయడంతో అదనపు భారం పడింది. ఇన్ని కష్టాల మధ్య పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మిర్చి పంటకు మద్దతు ధర లేక పెట్టుబడి రాలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మద్దతు ధరను క్వింటా రూ.18 వేలుగా ప్రకటించాలని అన్నదాతలు ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం కలగలేదు. అలాగే పత్తి రైతులకు కూడా నష్టాలు తప్పలేదు. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడితో అన్నదాతలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం కనీసం రైతుల గోడును ఆలకించలేదు. జిల్లాలో ఎంపీతో సహా ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరూ రైతులకు అండగా నిలవలేదు. కూటమి హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకంలో నిధులు విడుదల చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్సీపీ మాత్రమే రైతుల పక్షాన పోరాటం చేసింది.
అన్నదాత సుఖీభవ పథకం
కింద ఒక్కరికీ అందని నయాపైసా
ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు
కూటమి నేతల బీద అరుపులు
ఏడాది గడిచినా అమలు ఊసే
ఎత్తని సీఎం చంద్రబాబు
జిల్లా రైతులకు రూ.560.36 కోట్ల
మేరకు ఇప్పటికే ఎగనామం
పెట్టుబడి సాయం అందక 2.80
లక్షల మంది అన్నదాతలకు కష్టాలు
ఖరీఫ్ సాగుకు అధిక వడ్డీలకు ప్రైవేటు
వ్యక్తుల వద్ద తప్పని అప్పులు
వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో
రైతులకు రూ.1738 కోట్లు లబ్ధి

కూటమి దగా.. రైతులపై పగ