
8న వృద్ధులతో ‘యోగాంధ్ర’
నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటతోపాటు సత్తెనపల్లి, పిడుగురాళ్ల పట్టణాలలో కూడా ఈ నెల 8వ తేదీన సీనియర్ సిటిజెన్లతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో యోగాంధ్ర ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 5 వేల ప్రాంతాల్లో ఏకకాలంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాలను ఎంపిక చేసి, ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. యోగాంధ్ర యాప్ ద్వారా ఔత్సాహికులకు సంబంధిత శిక్షకులను మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.
శారీరక రుగ్మతలు మాయం
యోగా సాధన వల్ల మానసిక ఒత్తిడి తొలగడంతోపాటు శారీరక రుగ్మతలు తగ్గుతాయని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ వెంకటరమణ అన్నారు. జాతీయ యోగా డేలో భాగంగా శుక్రవారం పల్నాడు బస్టాండ్ పెద్దచెరువు రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బందితోపాటు సుమారుగా 200 మందికిపైగా ప్రజలు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏ ఇతర శాఖలకు లేని అవకాశం అటవీ శాఖకు ఉందని, ఎప్పుడూ అడవుల్లో తిరుగుతూ సహజసిద్ధమైన గాలిని పీల్చుకునే అటవీశాఖ ఉద్యోగులకు ఇదో మంచి అవకాశం అని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమయం కేటాయించి యోగా సాధన చేయాలని తెలిపారు. ఫారెస్ట్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మండల రెవెన్యూ అధికారి కె.వేణుగోపాలరావు, సిబ్బంది, యోగా ట్రైనర్లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు