
కూటమి మోసాల పాలనకు ఏడాది
అంతన్నారు.. ఇంతన్నారు.. అందరినీ నమ్మించారు.. గంపగుత్తగా ఓట్లేయించుకున్నారు.. చివరకు ముంచేశారు. వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ‘ఎర్ర’ పుస్తకం ఎంచుకున్నారు.. గ్రామాల్లో రక్తపుటేరులు పారించారు.. ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులు చేయించారు.. అడ్డొచ్చిన వారిని అడ్డగోలుగా మూయించారు.. కేసులంటూ వేధించారు.. ఊళ్లకు ఊళ్లనే ఖాళీ చేయించారు. టూకీగా జిల్లాలో కూటమి ఏడాది పాలన ఇది. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు.. నేడు వాటి అమలుపై మాత్రం బీద పలుకులు.. జిల్లాకు వచ్చిన కూటమి ముఖ్యనేతలు హామీల వరద పారించారు.. అరచేతిలో స్వర్గం చూపించారు. ఏడాది గడిచినా ఒక్కటంటే ఒక్క పథకమూ అమలు చేయలేదు.. ఒక్క హామీ పట్టాలెక్కలేదు. ఈ సారైనా హామీలు అమలు చేస్తారని నమ్మి ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.
జిల్లాను ఎరుపెక్కించారు
కూటమి పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతలు సానుభూతిపరుల ఇళ్లపై కూటమి గుండాలు దాడులు మొదలుపెట్టారు. వందలాది కుటుంబాలు పల్నాడు జిల్లా వదలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లి తలదాచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసులను అంబేడ్కర్ రాజ్యాంగం అమలుకు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వినియోగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలు సుమారు 390 మంది కార్యకర్తలు, పాతిక మంది సోషల్మీడియా యాక్టివిస్టులు, తొమ్మిది మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగారు. వందలాది మందిని జైళ్లపాలు చేసి కక్షా రాజకీయాలు చేస్తున్నారు. పోలీసులు పోలిటికల్ బాస్లకు సెల్యూట్ కొడుతున్నారన్న అపవాదుంది. మరోవైపు కూటమి నేతలు ఏడాదిగా ఇసుక, మట్టి, గ్రానైట్, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో రూ.కోట్ల సంపాదించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అక్రమించి వారి వశం చేసుకుంటున్నారు.
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ముంగిట అధికారంలోకి వస్తే సూపర్–6 పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పార్టీలు ఊరూవాడా తిరిగి ప్రచారం చేశాయి. ప్రతి సభలోనూ సూపర్ సిక్స్ పేరిట ఏయే పథకం ద్వారా ఎవరికి లబ్ధి కలుగుతుందో వివరించారు. జిల్లాలోని ప్రతి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పచ్చమీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరిట సూపర్–6లను వివరించారు. చంద్రబాబు పెదకూరపాడు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో పర్యటించి సంపద సృష్టించి అన్ని పథకాలను అమలుచేస్తామని భరోసానిచ్చాడు. ప్రజలు మరోసారి చంద్రబాబు అండ్ కో కపట మాటలను నమ్మి అధికారం అప్పగించారు. తీరా పీఠం ఎక్కి ఏడాదైనా చంద్రబాబు సూపర్–6 పథకాల అమలకు నోచుకోలేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల ఆకలికేకలు పెడుతున్నారు. ప్రజల వద్ద ధన మార్పిడి పెద్ద మొత్తంలో జరగకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని వ్యాపార వర్గాలు లబోదిబోమంటున్నాయంటే సంక్షేమ పథకాలు అమలుచేయకపోవడంతో ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగము లేదు.. భృతీ రాదు
ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 50 రోజులు దాటినా నిరుద్యోగల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఆలోగా ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి రూ.3 వేలను విడుదల చేయలేదు. ఈ పథకం ప్రకారం ఇంటికో నిరుద్యోగి అనుకున్న జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలకు నెలకు రూ.195.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు ప్రభుత్వం సుమారు రూ.2,345.76 కోట్లు బకాయిపడినట్లయింది. మరోవైపు కూటమి ప్రభుత్వ ఆధికారంలోకి రాగానే ఉద్యోగాలు పొందవచ్చని భావించిన యువత పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. చంద్రబాబు మరోసారి యువతను మభ్యపెడుతున్నాడంటూ గగ్గోలు పెడుతున్నారు.
నెలకు రూ.1500 హుళక్కే!
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6లో మరో కీలక హామీ 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య గల ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం. ఈ పథకం కోసం జిల్లాలోని మహిళలందరూ ఎదరుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల జిల్లాలోని 7,80,538 మంది మహిళలకు నెల నెలా ప్రభుత్వం రూ. 117.08 కోట్లు బకాయిపడినట్టు అవుతోంది. ఏడాదికి ఒక్కో మహిళకు రూ.18 వేల చొప్పున ఈ పథకం ద్వారా సుమారు రూ.1,405 కోట్లు అందజేయాల్సి ఉంది.
బస్సు.. తుస్సు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళందరికి ఉచిత బస్సుప్రయాణం కల్పిస్తామని హామినిచ్చారు. దీని ప్రకారం పల్నాడు జిల్లాలో 5 ఏళ్ల మొదలు మొత్తం 10,92,752 మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని వల్ల ఉపాధి, ఉద్యోగాలు, వైద్యం, వివిధ పనులపై నిత్యం బస్సుల ప్రయాణించే మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలో 461 బస్సులు నిత్యం 2,995 ట్రిప్పులు చొప్పున రోజుకు 1,73,573 కిలోమీటర్లు తిరిగుతున్నాయి. ఇలా ఆర్టీసీ బస్సులలో రోజుకు సగటున 1,41,717 మంది ప్రయాణిస్తుండగా రూ.59.22 లక్షల ఆదాయం ఆర్టీసికి సమకూరుతోంది. ప్రస్తుత ఆదాయం ప్రకారం రూ.30 లక్షల మహిళల నుంచి రోజు ఆదాయం వస్తోంది అనుకున్నప్పటికి , ఉచిత ప్రయాణం అంటే మరో రూ.10 లక్షల అధికంగా తిరిగినా రోజుకు రూ.40 లక్షలు మహిళలు ఉచిత ప్రయాణం పేరిట ఆదాయం కానుంది. అంటే ఈ పథకం సరిగా అమలు చేస్తే పల్నాడు జిల్లాలోని మహిళలకు ఏడాదికి రూ.146 కోట్లు లబ్ది కానుంది.
హామీలతో నమ్మించి ప్రజలను దగా ఊరూరా సూపర్సిక్స్ పేరుతో కరపత్రాలు ఒక్క పథకమూ ఇవ్వకుండా సామాన్యులను మోసం ఏడాదిగా అక్రమాలు, ఆక్రమణలు, మోసాలతో రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై హత్యలు, దాడులు పొలిటికల్ బాస్లకు సెల్యూట్ కొడుతున్న పోలీసులు నేటితో ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తి ప్రజలను మోసం చేస్తున్న కూటమికి వ్యతిరేకంగా నేడు వెన్నుపోటు దినం
ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం
అధికారంలో ఉండగా గత ఐదేళ్లు పేదలకు సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్ సీపీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాటాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదుర్కొంటూనే ఇచ్చిన హామీల అమలుకు పోరుబాట ప్రారంభించింది. రైతుకు అండగా, విద్యుత్ పోరు, యువత పోరు లాంటి కార్యక్రమాలతో జిల్లా కేంద్రంతో పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన ప్రదర్శనలు చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి ఏడాదైనా హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచించిన నేపథ్యంలో వెన్నుపోటు దినం పేరిట వైఎస్సార్ సీపీ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు.

కూటమి మోసాల పాలనకు ఏడాది