
కూటమి కోత
పేదల పింఛన్లకూ
ఏడాది పాలనలో పింఛనుదారులకు అష్టకష్టాలు
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హత కలిగిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని మేని ఫెస్టోలో పెట్టి ఎన్నికల ప్రచారంలో నేతలు వాగ్దానాలు చేశారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు సర్కార్ పింఛన్ ఇస్తుందని ఆశపడిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలను నిండా మోసం చేశారు. బాబు మోసాలపై గత అనుభవాలు తెలిసినా సూపర్–6 పథకాల పేరిట అరచేతిలో వైకుంఠం చూపడంతో ఓటేసిన ప్రజలకు మరోసారి వెన్నుపోటు తప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్కు అర్హత కల్పించి ఉంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికిగాను ఒక్కొక్కరికి రూ.48 వేల వంతున ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అంది ఉండేది. కూటమి ప్రభుత్వం తీరుతో జిల్లాలో సుమారు 2 లక్షల మందికిపైగా అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని అమలు చేయకపోవడంతో జిల్లాలో అర్హులైన వారు ఏడాదికి సుమారు రూ.960 కోట్ల మేరకు లబ్ధి పొందలేకపోయారు.
ఏడాదిలో 11,893 పింఛన్ల కోత
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటికి మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి అనుకూలంగా ఓటేయని వారందరినీ లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పింఛనుదారులకు సైతం నోటీసులు పంపి, అర్హత నిరూపించుకోవాలని చెబుతోంది. లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీ వెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా సామాజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఎవరో ఓ టీడీపీ నేత తమ పరిధిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల లిస్ట్ అందజేస్తే వారందరికీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసు అందుకున్న ఒంటరి మహిళలు కూడా తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పొంది ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొంటున్నారు. దివ్యాంగులైతే మరోసారి వైద్యుల నుంచి సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలని అడుగుతున్నారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా నోటీసులు ఇవ్వడం పట్ల ప్రజలు, ప్రజా సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గతేడాది జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జూన్కు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన 2,82,126 మంది లబ్ధిదారులకే జూలై నెలకు పింఛన్ మంజూరైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 2,70,233కు చేరింది. గత ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 11,893 తగ్గింది. ప్రభుత్వ చర్యల వల్ల అర్హులైన తమకు పింఛన్లు అందలేదని బాధితులు వాపోతున్నారు.
అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్కటీ ఇవ్వకపోగా ఉన్న వాటిలోనూ కోత ఆశగా ఎదురుచూస్తున్న లక్షలమంది అర్హులు ఏడాది పాలనలో జిల్లా వ్యాప్తంగా 11,893 మందికి పింఛన్లు రద్దు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికొదిలేసిన వైనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు మరోసారి చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి మోసపోయిన పేదలు
పల్నాడు జిల్లాలో గతేడాది జూలై నుంచి తగ్గుతూ వస్తున్న పింఛన్ల సంఖ్య వివరాలు
నా భర్త వృద్ధాప్య పింఛన్ తీసుకునేవారు. అనారోగ్య కారణాల వల్ల మరణించారు. నాకు పింఛన్ ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, ఎవరైనా మరణిస్తే ఇస్తామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. భర్త చనిపోయారని, ఆ స్థానంలోనైనా నాకు ఇవ్వమంటే పట్టించుకునేవారే లేరు. 65 ఏళ్ల వయసులో పింఛన్ వస్తే ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే బతుకు భారమైంది.
– పెరికల చెన్నమ్మ, మూసాపురం, పెదకూరపాడు మండలం
ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. అర్హులైన వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే అక్కసుతో అర్హులైన పేదల పింఛన్లను కూడా తొలగిస్తున్నారు. ఒక్క శావల్యాపురం మండల పరిధిలోనే ఇలా వందల సంఖ్యలో పింఛన్లు అన్యాయంగా తొలగించారు.
– బోడేపూడి కొండలు, శావల్యాపురం, వినుకొండ నియోజకవర్గం

కూటమి కోత

కూటమి కోత

కూటమి కోత

కూటమి కోత