
అటు మట్టి దందా..ఇటు ఆక్రమణలు
లాంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు
లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో ఓ వైపు మట్టి దందా, మరో వైపు స్థలాల వరుస ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువును చెరబట్టి రూ.కోట్ల విలువైన మట్టిని అమ్ముకొని జేబులు నింపుకొంటున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. కొండ పోరంబోకులో మట్టిని తోలి చదును చేసుకొంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
– లాం నుంచి జొన్నలగడ్డ వెళ్లే ప్రధాన రహదారిలో టీడీపీ నాయకులు కొండను మింగేసి మట్టిని తోలి పూడ్చివేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా జానెడు జాగాలో ఇళ్ళు నిర్మించుకొని నివసిస్తున్న పేదల ఇళ్లను 40కి పైగా పొక్లెయిన్లతో కూల్చారు. మరి కొంత మందికి నోటీసులిచ్చి, తమకు సహకరించాలని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. వీరి దుర్మార్గ వ్యవహారాలకు సహకరిస్తున్న అధికారులు సామాన్యులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణల పర్వానికి తెరదించాలని పలువురు కోరుతున్నారు.
అలరించిన శ్రీ గోదా కల్యాణం నృత్య నాటిక
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ నిర్విహిస్తున్న అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీమహా మంజీర నాదం సోమవారం ఆరో రోజుకి చేరింది. ఆలయ ప్రధాన కార్యదర్శి పుట్టగుంట ప్రభాకర్రావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. అనంతరం సీనియర్ మేకప్మేన్ ఆచారి (పసుపులేటి మద్దిలేటి)కి అపురూప రూపశిల్పి బిరుదుతో సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం సత్కరించారు. శ్రీగోదా కల్యాణం నృత్య నాటిక ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో మానం బ్రహ్మయ్య, తాళ్లూరి ధరణి, తాళ్లూరి చక్రవర్తి పాల్గొన్నారు.

అటు మట్టి దందా..ఇటు ఆక్రమణలు