సైకిల్‌ తొక్కు.. ఆరోగ్యం పట్టు

- - Sakshi

గుంటూరువెస్ట్‌: సైక్లింగ్‌.. సదా ఆరోగ్యమని పదే పదే నిపుణులు చెబుతుంటారు. అయితే నిన్నమొన్నటి వరకూ చెవికక్కించుకోని జనాలు కరోనా అనంతర పరిణామాల్లో ఎక్కువ మంది సైకిల్‌ వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. రోజూ సైకిల్‌ తొక్కుతున్నారు. ఇదే విషయాన్ని పర్యావేత్తలు కూడా నొక్కి చెబుతున్నారు. సంప్రదాయ ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించి, సైకిల్‌ వాడకాన్ని పెంచాలని తద్వారా పర్యవరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఏటా జూన్‌ మూడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా సైకిల్‌ పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సైక్లింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నీ ప్రయోజనాలే..

ప్రతి రోజూ క్రమం తప్పకుండా సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య పరంగా శరీర కండరాలు పరిపుష్టిగా తయారవుతాయి. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. శరీరం కాస్త అలసటకు గురై ఆకలి, నిద్ర పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చిన్నారులు స్థూలకాయానికి గురికారు. కంటి చూపు మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరి చురుకై న ఆలోచనలు వస్తాయి. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి వ్యాదులు దరిచేరవు. రవాణా ఖర్చులు అమితంగా తగ్గుతాయి. సామాజిక పరంగా పరిశీలిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను సైకిల్‌ ద్వారా కాపాడవచ్చని పలువురు సైక్లిస్ట్‌లు చెబుతున్నారు. ప్రతి రోజూ విధులకు సైకిల్‌పై చేరుకోవడం ద్వారా ఇందనం పొదుపు అవుతుంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి ఒక్కరూ సైకిల్‌పై విధులకు హాజరైతే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ గణణీయంగా తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.

నిద్రమాత్రలు అవసరం లేదని నిరూపిస్తూ..

ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు జమ్మూకాశ్మీర్‌లో జరిగే లడాక్‌ ఫెస్టివల్‌ నిద్రమాత్రలు అవసరం లేదని నిరూపిస్తుంది. తొమ్మిది రోజుల పాటు 200 కిలోమీటర్ల మేర జరిగే ఈ పండుగకు అప్పటికే నిద్రమాత్రలు అలవాటున్న 20 మందిని ఎంపిక చేస్తారు. వారితో ఉత్సాహంగా ఉదయం నుంచి సాయత్రం వరకు సైకిల్‌ తొక్కిస్తారు. ఫెస్టివల్‌ ముగిసే నాటికి నిద్రమాత్రలు మాత్రమే కాదు, పరుపు, దిండు అవసరం లేకుండానే నిద్ర పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సైక్లింగ్‌ ఆరోగ్య ప్రదాయని అనే రుజువు చేసేందుకే ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కు విజయవాడ నుంచి ఎంతో మంది హాజరవుతుంటారు.

ఆస్పత్రి ఖర్చులు ఉండవని నిరూపించారు..

ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌లో పని చేసే 400 మందికి కానిస్టేబుళ్లకు ఐదేళ్ల క్రితం సైకిళ్లు కొనిచ్చారు. వారు గతంలో ఏయే జబ్బులకు ఆస్పత్రికి వెళ్లారు, ఎంత ఖర్చు చేశారనే విషయాలను వారికి సైకిల్‌ ఇచ్చే ముందే ఉన్నతాధికారులు నోట్‌ చేసుకున్నారు. ఏడాది తరువాత పరిశీలిస్తే వారిలో ఏ ఒక్కరూ ఎలాంటి జబ్బుల బారిన పడలేదు. దీంతో ఆస్పత్రి ఖర్చులు లేనేలేవని ఈ వినూత్న ప్రయోగం ద్వారా నిరూపించారు.

యువతలోనూ పెరుగుతున్న క్రేజ్‌..

గడిచిన దశాబ్ధకాలంలో ఎన్నో రకాల మోడల్స్‌లో సైకిల్స్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రావడంతో నేటి తరం యువత సైకిల్‌పై మక్కువ చూపుతున్నారు. తయారీ విధానం, ఫీచర్స్‌ అనుగుణంగా ఒక్కో సైకిల్‌ రూ. 6 వేల నుంచి రూ. 25 వేల వరకు ధర పలుకుతున్నాయి. సైకింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వీలైన సైకిల్‌లు ధర రూ. లక్ష పైమాటే.

మారుతున్న సమాజధోరణి సైక్లింగ్‌కు అలవాటు పడుతున్న జనాలు పర్యావరణ హితంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుండటంతో మొగ్గు యువత కూడా సైకిల్‌ దారిలోనే..

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top