న్యూస్రీల్
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కళింగ స్టేడియంలో ..
భువనేశ్వర్: అండర్ 17 బాలురు, బాలికల 69వ భారత పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్.జి.ఎఫ్.ఐ) రగ్బీ జాతీయ చాంపియన్షిప్ పోటీలు స్థానిక కళింగ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రీడలు, యువజన సేవల శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి భూపేంద్ర సింగ్ పూనియా ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాస్తవ క్రీడా స్ఫూర్తితో పోటీపడి అంతర్జాతీయ స్థాయిలో తమ రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కృషి చేయాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులలో పాఠశాల, సామూహిక విద్యా శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి డాక్టర్ ఎన్.తిరుమల నాయక్, మాధ్యమిక విద్యా డైరెక్టర్ బీరేంద్ర కోర్కోరా, సహాయ డైరెక్టర్ (పీ.ఈ.టి) జ్యోతి ప్రసాద్ పరిడా, ఎస్జిఎఫ్ఐ పరిశీలకుడు అరవింద్ యాదవ్, అంతర్జాతీయ రగ్బీ క్రీడాకారిణి డుముణి మరాండి పాల్గొన్నారు. యువ క్రీడాకారులతో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. కళింగ స్టేడియం వంటి అంతర్జాతీయ వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల, సామూహిక విద్యా శాఖను ఎస్జిఎఫ్ఐ పరిశీలకుడు యాదవ్ అభినందించారు. భవిష్యత్లో ఒడిశాలో మరిన్ని అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, న్యూఢిల్లీ, గుజరాత్, జమ్మూ – కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, సీబీఎస్ఈ వెల్ఫేర్ స్పోర్ట్సు ఆర్గనైజేషన్, కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్తో సహా 15 రాష్ట్రాలు, సంస్థల నుంచి మొత్తం సుమారు 460 మంది క్రీడాకారులు అండర్ 17 చాంపియన్ షిప్లో పాల్గొంటున్నారు.


