● వంటగదిని వేరే చోటుకు మార్చాలని ఆదేశం
రాయగడ: జిల్లా కేంద్రాస్పత్రిని రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రక సోమవారం ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగో అంతస్తులో నిర్వహిస్తున్న వంటగదిని అక్కడ నుంచి తరలించి వేరే సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. నాలుగో అంతస్తులో పిడియాట్రిక్, అర్థోపెడిక్ తదితర వార్డులు ఉన్న నేపథ్యంలో ఏదైన అగ్ని ప్రమాదం సంభవిస్తే అయా వార్డుల్లోని రోగులను తరలించడం కష్టంగామారే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తులో రోగులను తరలించడానికి ర్యాంప్, లిఫ్టు వంటి సౌకర్యాలు లేకపొవడంతో కేవలం మెట్ల ద్వారా రాకపోకలు చేయాల్సిన దుస్థితి ఉండటం విచారకరమన్నారు. అలాగే నాలుగో అంతస్తులో పిల్లల కోసం కేటాయించిన వార్డుని మూసివేసి ఆ స్థానంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను ఉంచి స్టోర్ రూంగా మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా భవనం ఐదో అంతస్తులో ఉన్న డ్రెస్సింగ్ సామగ్రి, కుప్పలుగా పడి ఉన్న వాటి పరికరాలు, స్పిరిట్ వంటివి ఎంఎల్ఏ పరిశీలించారు. వీటన్నిటి దృష్ట్యా పై అంతస్తులో ఉన్న వంట గదిని వేరే ప్రాంతానికి తరలించాలని లేదంటే ప్రమాదం సంభవిస్తే చాలా ప్రాణనష్టం సంభవించే అవకాశం లేకపొలేదని హెచ్చరించారు.
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
భువనేశ్వర్: రాష్ట్రంలో సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన రహదారి దుర్ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రౌర్కెలా యమునాఢిప్ప వద్ద 143 నంబరు జాతీయ రహదారిపై కారు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చంపరాణ్ మటన్ హండి ఢాబా హోటల్ లోకి దూసుకు పోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కుంవర్ముండా సమీపంలో ముగ్గురు యువకులు నల్లటి కారులో రౌర్కెలా వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం రౌర్కెలా ఆస్పత్రిలో చేర్చారు. బీరమిత్రపూర్ ఠాణా మరియు కుంవర్ముండా ఔట్ పోస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టిన ట్రక్కు
బాలాసోర్ జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై దొహిసొడ కూడలి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక ట్రక్కు మరో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్సాహంగా రేస్
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో ఒడియా పక్ష 2026 సందర్భంగా సోమవారం ఒక చారిత్రక మాస్ రేస్–2026ను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్, యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ ఒడియ లాంగ్వేజ్, లిటరేచర్, అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షించింది. ఈ మాస్ రేస్లో వివిధ విభాగాలకు చెందిన మహిళలు పాల్గొని ఒడియా భాష, సంస్కృతి, సాహిత్యాల ప్రగతికి ప్రతి వారు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రతి దుకాణం, వ్యాపార వాణిజ్య సంస్థలు ఒడియా భాషలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు.


