జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో అడవిలో అగ్ని ప్రమాదాల నివారించేందుకు బొయిపరిగుడ అటవీ విభాగం సమితి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. వేసవి ఇంకా ప్రారంభం కాకపోయినా బొయిపరిగుడ సమితిలోగల అడవుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో అటవీ విభాగ అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే రోజుల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ర్యాలీ చేశామని బొయిపరిగుడ ఫారెస్టు రేంజర్ సందీప్ కుమార్ పాణిగ్రహి వెల్లడించారు. ముఖ్యంగా చైత్ర పర్వ్ పండగలో అడవులలో మంటలు పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బొయిపరిగుడ సమితి బహుళ ఆదివాసీ ప్రాంతం అని అడవులు తగ్గి పోతుండటం వల్ల పర్యావరణంపై పడే ప్రభావం గురించి ప్రజలలో అవగాహన తక్కువ అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సచేతన ర్యాలీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.


