శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమంతో పేదరికం నిర్మూలన సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీ–4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపా రు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీఆర్వో విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధి కారి లక్ష్మీప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పాతపట్నం: ఆకలి తీర్చడానికి చనుబాలు లేవు.. ఏడుపు ఆపడానికి తల్లి పొత్తిళ్లు లేవు.. ఒంటి నిండా చీమల కాట్లు.. కంటి నిండా కన్నీటి బొట్లు. వారం వయసున్న పిల్లాడు పొదల మధ్య పడిన అవస్థ ఇది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలోని సత్యనారాయణ ఆలయం పక్కన ఘంసీ పుల్లాయ్ ఇంటి పెరటిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరో పసి కందును పడేసి వెళ్లిపోయారు. ఆ పసికందు గుక్కపట్టి ఏడవడంతో భూదేవి అనే మహిళ బాబును రక్షించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో బాబుకు సపర్యలు చేసి, శరీరాన్ని శుభ్రం చేశారు. బాబుకు వైద్య సేవల కోసం మంగళవారం ఉదయం తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం బాబు భూదేవి అనే మహిళ వద్ద గ్రామస్తులు ఉంచారు.


