రాయగడ: రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది బ్రజసుందర్ నాయక్ విజయం సాధించారు. ఉదయం 7 గంటలకు కోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా 201 మంది న్యాయవాదుల్లో 195 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి బ్రజసుందర్ నాయక్, బిరజా పాత్రోలు పోటీపడ్డారు. సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో బ్రజసుందర్ నాయక్కు అనుకూలంగా 105 ఓట్లు పోలవ్వగా, బిరజా పాత్రోకు 86 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 4 చెల్లనట్టుగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఉమాకాంత మిశ్రో తెలియజేశారు. దీంతో బ్రజసుందర్ నాయక్ తన ప్రత్యర్థి బిరజా పాత్రోపై 19 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
పర్లాకిమిడిలో...
పర్లాకిమిడి బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం ఉదయం జిల్లా కోర్టులోని బార్ రూమ్లో జరిగాయి. ఎన్నికల అధికారిగా మలయమారుతీ దేవి, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా జీఎస్ పట్నాయిక్లు వ్యవహరించారు. మొత్తం బార్ అసోసియేషన్లో 127 మంది ఓటర్లకు గాను, 108 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బార్ అధ్యక్షుడిగా రామకృష్ణ నాయక్ 63 ఓట్ల తేడాతో హీరాచంద్పై గెలుపొందారు. అలాగే కార్యదర్శిగా కాశీనాథ్ దాస్, ఉపాధ్యక్షుడిగా శివప్రసాద్ పాణిగ్రాహిలు గెలిపొందారు. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా యడ్ల శివకుమార్, కోశాధికారిగా సందీప్ కుమార్ పట్నాయిక్, లైబ్రేరియన్గా రఘునాథ పాత్రో, కార్యవర్గ సభ్యులుగా బండి విశ్వనాథం, చందన్ పట్నాయిక్, సైలాడ శ్రీరాములు, సత్యనారాయణ పాడి, అశోక్ అధికారి, గగారియన్ సొబొరోలు ఎన్నికయ్యారు.


