మల్కన్గిరి: వచ్చేనెల ఒకటో తేదీన జరగనున్న ఒడిశా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే అన్నారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయించాలని, కార్యాలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాభు పాల్గొన్నారు.
కోర్సండ గ్రామంలో
సిమెంటు బెంచీలు ప్రారంభం
పర్లాకిమిడి: జిల్లాలోని గుసాని సమితి కోర్సండ గ్రామంలోని రామాలయం ఆవరణలో సిమెంటు బెంచీలను శుక్రవారం ప్రారంభించారు. స్వర్గీయ గొట్టిపల్లి మల్లేశు, ఆదమ్మ, పారిశెల్లి శ్రీరాములు సరస్వతీ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు బెంచీలను సమకూర్చారు. వీటిని సర్పంచ్ గుంపు రామకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యయు ధర్మాన కామేశ్వరరావు నాయుడు ప్రారంభించారు. పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యాయ ఆవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.
భవనాన్ని ఢీకొట్టిన రుకుణ రథం
భువనేశ్వర్: లింగ రాజు మహా ప్రభువు యాత్రలో శుక్రవారం అపశృతి చోటు చేసుకుంది. గురువారం అర్ధాంతరంగా ఆగిపోయిన రుకుణ రథం శుక్రవారం మధ్యాహ్నం 2.56 గంటలకు బయల్దేరడంతో యాత్ర పునఃప్రారంభమైంది. ఘంటానాథంతో ముందుకు కదులుతున్న రథం అదుపు తప్పి వీధిలోని ఓ భవంతి పైభాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో భవనం కొంత మేరకు దెబ్బతింది. రథాన్ని సరిచేసి ముందుకు నడిపించేందుకు అనుబంధ సేవాయత్ వర్గం భారీగా కసరత్తు చేయాల్సి వచ్చింది. దాదాపు గంట సేపు నిర్విరామంగా శ్రమించి రథాన్ని సరైన మార్గంలో నడిపించి యాత్ర కొనసాగించారు. ఈ ఘటన పట్ల భక్తుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంది.
అంచెలంచెలుగా చేరుతున్న రథం కలప
భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న శ్రీ జగన్నాథుని రథ యాత్ర నిమిత్తం రథం కలప దుంగలు అంచెలంచెలుగా శ్రీ మందిరం సింహ ద్వారం సమీపంలో రథాల తయారీ శాలకు చేరుతున్నాయి. మూడో విడత కలప దుంగలు శుక్రవారం ఈ ప్రాంగణానికి చేరాయి. పవిత్ర అక్షయ తృతీయ నుంచి రథాల నిర్మాణం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఎలాంటి నమూనా చిత్రాలు, యంత్రాలు, కొలత సాధనాలు లేకుండా యాత్రకు అవసరమైన 3 భారీ రథాలు ఏటా తయారు చేయడం విశేషం. తరతరాల అనుభవ జ్ఞానం, నైపుణ్యం అంది పుచ్చుకున్న నేటి తరం వడ్రంగి వర్గం వారసత్వ వృత్తి నైపుణ్యం ప్రదర్శించడం విశేషం. తరాల నుంచి తరాలకు వారసత్వంగా వస్తున్న సంప్రదాయంగా కొనసాగుతుంది.


