పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా పీఎస్ పరిధి కసారిగూడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున సబ్ డివిజనల్ పోలీసుఅధికారి రాకేష్ సాహు నేతృత్వంలో అడవ, మోహన పోలీసులు దాడులు చేసి భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. కసారిగూడ గ్రామంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 202 ప్లాస్టిక్ బ్యాగుల్లో గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. మోహన తహసీల్దార్ సమక్షంలో గంజాయి బస్తాలు కాటా వేయగా పట్టుబడిన గంజాయి 4060 కిలోలు (4.06 టన్నులు)గా నిర్ధారించినట్టు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా విలేకరులకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను మోహన కోర్టులో హాజరుపరిచారు.
జిల్లా కేంద్రాస్పత్రి సమస్యలను పరిష్కరించండి
జయపురం: జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. సమాజ సేవకుడు బి.హరి రావు నేతృత్వంలో గ్రామ ప్రజలు జయపురం సబ్కలెక్టర్, ఐటీడీఏ పీఓ తృప్తి బొరాయికు గురువారం మెమోరాండం సమర్పించారు. ఎంతో కాలం తర్వాత జయపురంలో జిల్లా కేంద్రాస్పత్రి ఏర్పాటు చేశారని, అందువల్ల సబ్ డివిజన్లో గల ప్రజలకు సముచిత వైద్య సేవలు లభించగలవని ఆశించామని, అయితే నేడు హాస్పిటల్ స్పెషలిస్టు డాక్టర్లు లేరని ఆరోపించారు. జూనియర్ డాక్టర్లతో హాస్పిటల్ నడుపుతున్నారని వెల్లడించారు. సీరియస్, ప్రమాదాల్లో క్షతగాత్రులు సరైన చికిత్స పొందలేకపోతున్నారని, వారిని కొరాపుట్లో గల సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలిస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచి వారిని బరంపురం, భువనేశ్వర్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నామని ఆరోపించారు. మరికొంత మంది రోగులు మెరుగైన చికిత్స కోసం వైజాగ్ వెళ్తున్నారని తెలిపారు. ఇక్కడ నిపుణులను నియమించాలని కోరారు.


