జయపురం: జనజాతుల మౌళిక హక్కుల సాధనకు ఈ నెల 24వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జాతీయ జనజాతీ సురక్షా మంచ్ ఇచ్చిన పిలుపుమేరకు కొరాపుట్ జిల్లా నుంచి జనజాతి సురక్షా మంచ్ ప్రతినిధులను పంపేందుకు ఆదివారం స్థానిక వనవాసి కళ్యాణ మంచ్ కార్యాలయంలో కొరాపుట్ జిల్లా జనజాతి సురక్ష మంచ్ సమావేశమైంది. జిల్లా అధ్యక్షుడు బాలాజీ బెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వనవాసీ కళ్యాణ ఆశ్రమ యువ విభాగ ప్రాంతీయ సమన్వయ కర్త రతికాంత సాహు ఢిల్లీ లో నిర్వహించే ఉద్యమం యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను, మార్గదర్శకాలను వివరించారు. దేశంలో మౌళిక హక్కుల పరిరక్షణ, రాజ్యాంగంలో ఆర్టికల్ 341ను తప్పకుండా కఠినంగా అమలు చేయటం, జనజాతి సంప్రదాయ ప్రజలను ప్రలోబాలు చూపి మతమార్పికి పాల్పడుతున్న వారి నుంచి విముక్తి కల్పించటం ప్రధాన లక్ష్యంగా అఖిల భారత జన జాతి సురక్ష మంచ్ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీకి పిలుపు నిచ్చిందని వెల్లడించారు. రెండు లక్షలకు పైగా జనజాతి ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో కొరాపుట్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొరాపుట్ జిల్లా వన వాసి సమన్వయ కర్త చిత్ర సేన్ మాట్లాడుతూ ర్యాలీలో కొరాపుట్ జిల్లా నుంచి 100 మందితోపాటు అవిభక్త కొరాపుట్ నుంచి 250 మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో వనవాసి కళ్యాణ ఆశ్రమ యువ విభాగ ప్రాంత సహాయ సమన్వయకర్త లక్ష్మీకాంత మిశ్ర, సధా భూమియ, ప్రపుల్ల బిశాయి, దహనాఘీవురియ, ద్రౌపతి నాయక్, దుర్లభ మఝి, వికాస్ చలాన్, తదితరులు పాల్గొన్నారు.


