అమ్మో దెయ్యం..
● మర్రిగూడలో పేట్రేగుతున్న మూఢ నమ్మకాలు ● నచ్చజెప్పే ప్రయత్నంలో సమితి అధికారులు
రాయగడ :
జిల్లా కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రి గూడలో మూఢ నమ్మకాలు ప్రబలుతున్నాయి. ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయని స్థానికులు భయపడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొంత మంది దెయ్యాల భయం వల్ల జ్వరాలకు గురతువున్న సంఘటన కూడా వెలుగు చూసింది. దెయ్యాల బెడదను తెలుసుకునే ప్రయత్నంలో గ్రామానికి చెందిన కొంత మంది యువకులు రాత్రుళ్లు గ్రామ శివారులో కాపలా కాస్తున్నారు. ఇక్కడి విషయం దావానంలా వ్యాపించడంతొ ప్రస్తుతం ఆ గ్రామానికి పంచాయతీ అధికారులు పరుగులు తీస్తున్నారు. కొన్నాళ్ల కిందట గ్రామానికి చెందిన పార్వతీ తాడింగి (70), కమల కిలక (38), కట్టి తాడింగి (65), అదేవిధంగా మరో మూడు నెలల శిశువు మృతి చెందారు. గ్రామంలో గల మరణాలకు కారణం దెయ్యాలేనని గ్రామస్తులు గట్టిగా నమ్మారు. దీంతొ గ్రామంలో దెయ్యాలు సంచరిస్తున్నాయని వదంతులు ఎక్కువవ్వడంతో ఏ పనికై నా గ్రామస్తులు గుంపులుగానే వెళ్లి గుంపుగానే వస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి తలుపులు మూసుకుని బితుకు బితుకుమంటూ ఇళ్లలో ఉండిపొతున్నారు. మరి కొంత మంది మహిళలు తమకు దెయ్యం పట్టిందని వికృత చేష్టలు చేస్తూ మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బీడీఓ సుజిత్ మిశ్రా, పంచాయతీ కార్యదర్శి బిజయ్ కుమార్ నాయక్లు గ్రామంలో పర్యటించారు. గ్రామప్రజలతో సమావేశమయ్యారు. ఇదంతా వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. ఇటువంటివి నమ్మవద్దని వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. గ్రామంలో సుమారు 45 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. అంతా రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు, ఈ దెయ్యాల భయం పుణ్యమా అని గ్రామంలొ వారు కూలి పనులకు కూడా వెళ్లడం లేదు.
అమ్మో దెయ్యం..
అమ్మో దెయ్యం..
అమ్మో దెయ్యం..


