టీ షర్ట్ల పంపిణీలో వివాదం
జలుమూరు: శ్రీముఖలింగం ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని నదికి తీసుకెళ్లేందుకు దేవదాయ శాఖ అందజేసిన టీ షర్ట్ల పంపిణీలో బుధవారం వివాదం చోటుచేసుకుంది. నంది వాహనం వంశధార నదికి తీసుకెళ్లేందుకు ఉత్సాహవంతులైన యువతను గుర్తించి 150 వరకు టీ షర్ట్లు అందజేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు కాకుండా కూటమి నాయకులు చెప్పినవారికే టీ షర్ట్లు అందజేశారని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, ఎంపీటీసీ కె.హరి ప్రసాద్ ఆలయ చైర్మన్ శివకుమార్ పాడి, సర్పంచ్ టి.సతీష్ను నిలదీశాడు. కనీసం ప్రజాప్రతినిధి అని చూడకుండా ఈవో ఏడుకొండలు ఏకపక్షంగా కూటమి నాయకులు చెప్పిన వారికే అందజేశారని మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం పొందర వీధి గ్రామస్తులు పల్లకీని సిద్ధం చేయాలి. కాళింగ వీధి యువత ఆ పల్లకీని మోయడం అనవాయితీగా వస్తోంది. కానీ ఇవేమీ కాకుండా టీడీపీ నాయకులు చెప్పిన వారికే టీ షర్టులు ఇచ్చి ఆలయ సంప్రదాయాన్ని మంటగలిపారని యువత పెద్ద ఎత్తున ఈవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అయితే స్వామివారిని నదికి తీసుకెళ్లేందుకు సమయం ఆసన్నమవ్వడంతో ఎంపీటీసీ హరి ప్రసాద్, గ్రామ పెద్దలు ఆ వివాదాన్ని సద్దు మణిగించారు.


