డీ–పట్టా యజమానికి నోటీసులు
పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 410/3లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని చెబుతున్న డీ–పట్టాదారునికి నోటీసులు ఇచ్చామని పలాస తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలపై ‘యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు’ శీర్షికతో ఇటీవల సాక్షి పత్రికలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనికి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తవ్వకాలను నిలుపుదల చేశారు. అనంతరం వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిన చేశారు. గ్రావెల్ తవ్వకాలకు తమ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతి లేదన్నారు. విచారణలో ఆ గ్రావెల్ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని ఎంఐజీ లే అవుట్కు సుడా వారు తరలించారన్నది స్పష్టమైందన్నారు. ఇక నుంచి పెంటిభద్ర సర్వే నంబర్ 410 నుంచి కంకర తరలించరాదని సంబంధిత కాంట్రాక్టర్ను హెచ్చరించామన్నారు. అలాగే పట్టా ఉన్నట్టు పేర్కొన్న స్థల యజమానికి నోటీసులు ఇచ్చామని, డీ–పట్టా అక్రమమని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు కట్టడి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.


