ఘనంగా ఆదివాసీ గుర్తింపు వార్షికోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి పప్పులూర్ పంచాయతీలో కొండరెడ్డి సమాజానికి ఆదివాసీ గుర్తింపు లభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కొండరెడ్డి సమాజ అధ్యక్షుడు రామారావు ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నవరంగ్పూర్ ఎంపీ బలభద్ర మాఝి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కొండరెడ్డి తెగ ఇక్కడే నివసిస్తున్నందున వీరికి ఆదివాసీ గుర్తింపు కల్పించాలని ఏన్నో ఏళ్లు పోరాటం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 14వ తేదీన అధికారికంగా ఆదివాసీలు గుర్తిస్తూ ప్రకటించిందన్నారు. భవిష్యత్లో కొండరెడ్డి సమాజానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందాలన్నారు. గత పదేళ్లుగా తాను కేంద్ర ప్రభుత్వ మైనారిటీ, గిరిజన మంత్రిత్వ శాఖల వద్ద పదే, పదే ఈ విషయాన్ని వినిపించానన్నారు. ప్రభుత్వం సమస్యను అర్థం చేసుకుని ఆమోదించిందని వెల్లడించారు. పప్పులూర్, కుర్మానూరు ప్రాంతాల్లో ఒకప్పుడు మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. గత కొనేళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆదివాసీ గుర్తింపు రావడంతో గిరిజనుల్లో ఆనందోత్సవం చూశామన్నారు. ఈ సందర్భంగా కొండరెడ్డి సమాజ భవనాన్ని ప్రారంభించారు. పాఠశాల వద్ద జెండాను ఆవిష్కరించారు. మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, మాజీ ఎంపీ మురళీధర్ జెనా, కార్యదర్శి పి.శ్రీగురు, ఆదివాసీ సంఘ అధ్యక్షుడు బాలరాజు గెమెల్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆదివాసీ గుర్తింపు వార్షికోత్సవం


