
కొత్త ఏడీజే, విజిలెన్స్ కోర్టుల ఏర్పాటుకు ఉత్తర్వులు
భువనేశ్వర్: రాష్ట్రంలో కొత్తగా 8 అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టులు, 3 విజిలెన్స్ కోర్టుల ఏర్పాటుకు న్యాయ శాఖ ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం బంకి, రొణొపూర్, బొణొపూర్, బాసుదేవ్పూర్, పిప్పిలి, తాల్చేర్, రాజ్గంగ్పూర్, జి.ఉదయగిరి ప్రాంతాల్లో 8 అదనపు జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తారు. కేంద్రాపడా, నయాగఢ్, పూరీ ప్రాంతాల్లో 3 విజిలెన్న్స్ కోర్టులు ఏర్పాటవుతాయి.
అత్యాచారం చేశారని ఫిర్యాదు
రాయగడ: తనపై అత్యాచారం జరిగిందని, దీనిపై జిల్లాలోని గుణుపూర్లో గల ఆదర్శ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిందితుడిని పట్టుకోవడం లేదని ఒక యువతి సోమవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో కలెక్టర్ అశుతొష్ కులకర్ణికి విన్నవించారు. గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలొని సిర్జిలి గ్రామానికి చెందిన చిన్నారావు అనే వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీనిపై 10 వ తేదీన గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, కానీ వారు చర్యలు తీసుకోలేదని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
చిక్కిన మొసలి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి యం.పి.వి.83 గ్రామంలోని చెరువులో మొసళ్లు వున్నాయి. అని దాని కోసం ముడు రోజులుగా గాలింపు చర్యలు అధికారులు చేపడుతున్నారు .అయితే చివరికు సోమవారం చెరువులో నీటి మఠం తగ్గించి చివరి ప్రయత్నంగా వేసిన వలకు ఓ మొసలి చిక్కింది. ఈ చెరువు 15 అడుగుల లోతు ఉండటంతో మొసలి చాల ఇబ్బంది పెట్టినట్టు అటవీశాఖ వారు తెలిపారు .నీరు పైపు ద్వారా బయటకు తీయించి అనంతరం మొసలిని పట్టుకోవడంతో స్థానికులు ఊపీరి పీల్చుకున్నరు.
శ్రీమందిరంలో రహస్య
కెమెరాతో చిత్రీకరణ
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలో రహస్య కెమెరాతో నిషేధిత దృశ్యాల్ని చిత్రీకరిస్తున్నట్లు అనుమానం రావడంతో సోమవారం ఓ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక టౌన్ పోలీస్ ఠాణాలో అతడిని ప్రశ్నిస్తున్నారు. శ్రీ మందిరంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరగడంతో భద్రతా వైఫల్యాలను బలపరుస్తున్నాయి. కళ్లజోడులో అమర్చిన స్పై కెమెరాతో శ్రీమందిరం లోపలి దృశ్యాల్ని చిత్రీకరిస్తూ ఇటీవల స్థానిక యువకుడు పట్టుబడిన విషయం తెలిసిందే.
90 లీటర్ల నాటుసారా స్వాధీనం
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెరువలి డీపీ క్యాంప్ ప్రాంతంలో పోలీసులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. దాడుల్లో 90 లీటర్ల నాటుసారా, 27 లీటర్ల వివిధ బ్రాండ్లు గల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవాన్ సాహు అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు సోమవారం తరలించారు.
120 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు అక్రమ రవాణా కోసం అడవిలో దాచిన 120 కిలోల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో గల జబాగడ్ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు గంజాయిని బస్తాల్లో ఉంచి నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న బలిమెల ఐఐసీ దీరాజ్ పట్నాయక్ తన సిబ్బందితో ఆ గ్రామ అడవిపై ఆదివారం రాత్రి దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుున్నారు. సోమవారం తూకం వేయగా 120 కేజీలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాని విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
రూ.1.66 లక్షల ఆర్థిక సాయం అందజేత
ఆమదాలవలస: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీహెచ్ రంజిత్ కొద్ది నెలలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడడంతో సరైన వైద్యం అందించలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని గమనించిన కళాశాల అధ్యాపకులు విద్యార్థి పరిస్థితిపై చలించిపోయారు. ఈ మేరకు ఉదార హృదయంతో వారంతా కలిసి రూ.1.66 లక్షలు సేకరించి కళాశాల ప్రిన్సిపాల్ బి.శ్యామ్సుందర్ చేతులమీదుగా సోమవారం రంజిత్ కుటుంబానికి అందజేశారు. దీంతో వీరిని స్థానికులు అభినందించారు.

కొత్త ఏడీజే, విజిలెన్స్ కోర్టుల ఏర్పాటుకు ఉత్తర్వులు