మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళా క్రికెట్ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తమ అసోసియేషన్ తరఫున ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు నిర్వహిస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చెప్పారు. స్థానిక పటమటలోని ఏసీఏ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది. శివనాథ్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఈ లీగ్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. ప్రాంచైజీ విధానంలో తొలిసారిగా మహిళల క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు.
నాలుగు జట్లు..
నాలుగు జట్లు పోటీపడనున్న ఈ లీగ్లో అన్ని మ్యాచ్లను గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఏసీఏ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహిస్తున్నామని, ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. మహిళా క్రికెట్ను యువతకు చేరువ చేయడంలో భాగంగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని మహిళా కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థినులను మ్యాచ్లు జరిగే స్టేడియంకు తీసుకురావడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శివనాథ్ చెప్పారు. విద్యార్థినులను స్టేడియానికి తీసుకొచ్చి, మ్యాచ్ అనంతరం తిరిగి కళాశాలలకు చేర్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 19వ తేదీ శనివారం మధ్యాహ్నం జరిగే తొలి మ్యాచ్కు నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరై లీగ్ను ప్రారంభిస్తారని చెప్పారు.
మంగళగిరి ఏసీఏ స్టేడియంలో
డే అండ్ నైట్ మ్యాచ్లు
ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం..
విద్యార్థినులకు ఉచిత బస్సులు
ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని
శివనాథ్ వెల్లడి


