భవానీపురం(విజయవాడపశ్చిమ): వినాయక చవితి సందర్భంగా విజయవాడ విద్యాధరపురం లేబర్కాలనీ గ్రౌండ్లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన 72 అడుగుల ఎత్తయిన పంచముఖ వరసిద్ధి మహా మట్టి గణపతి విగ్రహానికి ప్రపంచ రికార్డు లభించింది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన పర్యావరణ హిత గణేష్ విగ్రహంగా ఇంజీనియస్ చార్మ్ వరల్డ్ రికార్డ్స్ (ఐసీడబ్ల్యూఆర్) సంస్థ గుర్తించి ధ్రువీకరించింది. బుధవారం సాయంత్రం సంస్థ ప్రతినిధులు సమితి కమిటీ సభ్యులకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను అందజేశారు. కాగా ఉదయం మహిళలతో సంకటహర గణేష్ స్త్రోత్ర పారాయణ, వీణా వాయిద్య కచేరి జరిగాయి. రాత్రి మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చిన పండితులు శ్రీలక్ష్మీనారాయణ కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, డూండీ గణేష్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


