మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేస్తూనే సర్కిల్ వారీగా నిర్దేశించిన రెవెన్యూ వసూళ్లు సాధించేలా విద్యుత్ సిబ్బంది దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీ డీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. గుణదలలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ కలెక్షన్ గురించి, విద్యుత్ సబ్స్టేషన్ల పనుల పురోగతి వివరాలను అధికారులను పుల్లారెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ తగ్గింపుపై సిబ్బంది దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్, ప్రధాన మంత్రి కుసుమ పథకాల అమలు వివరాలపై ఆరా తీశారు. ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేశారు. విద్యుత్ సరఫరా, విద్యుత్ బిల్లు పరమైన సమస్యలతో పాటుగా కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ హనుమయ్య, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా అఽధికారులతో
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి


