హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. అందులో భాగంగా వైద్య కళాశాలల కోసం నూతనంగా నాక్ ఎంబీజీఎల్ అక్రెడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో బుధవారం ఆ రెండు అంశాలపై ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో యూనివర్సిటీ పరధిలోని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఎంబీజీఎల్ అక్రెడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు సంబంధించి తాజా మార్పులు, విధానాలపై చర్చించారు. వాటి ద్వారా కేవలం మూల్యాంకన పద్ధతులు మాత్రమే కాకుండా, వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రేరణగా పనిచేస్తాయన్నారు. ఈ సెమినార్కు రిసోర్స్ పర్సన్గా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్ సీఈఓ టి.రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు, డాక్యుమెంటేషన్ విధానాలు, అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, పరిశోధన ప్రాముఖ్యత వంటి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, పబ్లికేషన్స్ డైరెక్టర్ కె.సుధ తదితరులు పాల్గొన్నారు.


