మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలపై ఆసక్తిని పెంపొందించేకు మేలో తమ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవి నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రవి నాయుడు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నుంచి 16 ఏళ్ల లోపు పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహిస్తా మని చెప్పారు. రాష్ట్రంలోని 423 మండలాల్లో 1,020 ప్రాంతాల్లో 55 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంప్లు జరుగుతాయని పేర్కొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. క్యాంప్ల పనితీరును పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ల్లో అవసరమైన క్రీడా సామగ్రి కోనుగోలుకు నిధులను కేటాయించామని తెలిపారు. శాప్ ఏఓ వెంకట రమణ నాయక్ పాల్గొన్నారు.


