కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హెడ్కానిస్టేబుల్ కొండపల్లి శ్రామికనగర్ వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన అతను మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు కొండపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి ప్రభుకుమార్(56) వీరులపాడు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొండపల్లి కొత్తగేటు సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోడ్డుపై పడిన ప్రభుకుమార్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. 108 వాహనంలో విజయవాడ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇబ్రహీంపట్నం: ఈలప్రోలు చేపల చెరువుల వివాదంలో టీడీపీ నాయకులు అరాచకాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. గుంటుపల్లికి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు కంచికచర్లకు చెందిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ రామకృష్ణను రంగంలోకి దించి మత్స్యశాఖ అధికారులకు మామూళ్లు ఇవ్వాలని చెరువు లీజుదారుడు బలే లక్ష్మణరావుతో రూ.1.10 లక్షలు ఫోన్పే చేయించారు. ఆ తర్వాత గుంటుపల్లి టీడీపీ నాయకులు ఆ నగదును తమకు ఫోన్పే చేయించుకున్నారు. మీడియాను మేనేజ్ చేయాలని ఓ పీడీఎఫ్ పేపర్ రిపోర్టర్ను లీజుదారుల వద్దకు తీసుకెళ్లి ఇతను మండలానికి పెద్ద రిపోర్టర్ అని పరిచయం చేసి రెండు సార్లుగా రూ.40 వేలు ఫోన్పే చేయించుకున్నారు. తిరిగి ఆ నగదు రిపోర్టర్కు కొంత ఇచ్చి మిగిలింది ప్రజాప్రతినిధి అనుచరులు నొక్కేశారు. విద్యుత్ బిల్లు రూ.2 లక్షలు పెండింగ్ ఉందని అందుకే చేపల వాహనం అడ్డుకున్నామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొల్లేరు వాసులు విద్యుత్ శాఖకు కట్టిన డిపాజిట్ రూ.2.60 లక్షలు ఉందని, మీటర్ రద్దు చేసుకుంటే ఆ నగదు బకాయి కింద జమ చేసుకుంటారని చెబుతున్నారు. చేపల చెరువు వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


