నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్
ఆటోనగర్(విజయవాడతూర్పు): దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) సెంట్రల్ జనరల్ కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఏపీలో మూడు వేలకు పైగా క్లర్క్, నాలుగు వేల వరకు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 1,000 మంది ఆర్మీ గార్డుల కొరత కూడా ఉందన్నారు. తక్షణమే సిబ్బందిని నియమించకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అంతకు ముందు ఆల్ఫా టీ క్యాంటీన్ నుంచి ఏటీఏ హాలు వరకు బ్యాంకు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు.


