ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో వ్యాపారాలు సాగిస్తున్న వారు దేవస్థాన నియమ నిబంధనలను పాటించాలని లేకుంటే లీజ్ రద్దు చేస్తామని ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలోని దుకాణదారులు, కాంట్రాక్టర్లు, లీజుదారులతో ఈవో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. దేవస్థానం నిర్ధేశించిన సమయాన్ని పాటించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం ఎదుట ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విక్రయించినట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. దుకాణాలు, కాంట్రాక్టర్ల వద్ద పని చేసే సిబ్బంది ఆధార్ కార్డులతో పాటు వారి ఫొటోలతో కూడిన ఐడీ కార్డులను తప్పనిసరిగా ధరించాలన్నారు. దుకాణదారుల మధ్య ఎటువంటి వివాదాలు, గొడవలు, పోలీసుల కేసులు వంటి అంశాలను తీవ్రంగా పరిగణించి లీజ్ రద్దు చేస్తామని చెప్పారు. అద్దె బకాయిలు ఉన్న వారు వెంటనే బకాయిలు చెల్లించాలని, దుకాణాలకు కేటాయించిన స్థలం హద్దు దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్, కొబ్బరి కాయలు కొట్టే వారు డబ్బులు వసూలు వంటి ఫిర్యాదులపై తగిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏసీ రంగారావు, ఏఈవో రమేష్బాబు, లీజెస్ విభాగం అధికారులు, సిబ్బంది, దుకాణదారులు పాల్గొన్నారు.
ఆదివారం ఆలయ ఈవో శీనానాయక్ దుర్గగుడి ప్రాంగణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


