గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీల ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా మే 17న విజయవాడలో బీసీ మేథోమధన సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. నగరంలోని బెంజ్సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో మే 17 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో బీసీ సంఘ నాయకులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ ఐలాపురం హోటల్లో సదస్సు నిర్వహణపై బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీసీల మేథోమధన సదస్సులో జనగణనలో బీసీల కుల గణన సక్రమ నిర్వహణపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. బీసీ రక్షణ చట్టం, 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ వంటి వాగ్ధానాలు త్వరితగతిన అమలు చేసేందుకు ఒత్తిడి చేసేలా చర్చ జరుగుతుందని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, యువజన అధ్యక్షుడు పారుపల్లి మహేష్, మేకా వెంకటేశ్వరరావు, కొల్లూరు హనుమంతరావు, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, జేఎల్ కుమార్, బి.శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


