మచిలీపట్నంటౌన్: జనగణన – 2027కు సంబంధించి 5కే రన్ను శనివారం నగరంలో నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. భారతదేశ జనగణన జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మీదుగా తిరిగి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు 5కే రన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో సాంబశివరావు, ట్రైనింగ్ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, కలెక్టరేట్ ఏవో రాధిక, కమిషనర్ బాపిరాజు, వివిధ శాఖల ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పామర్రు: విజయవాడ–మచిలీ పట్నం జాతీయ రహదారిలో కారు అదుపు తప్పి కాల్వలోకి పడిన సంఘటన శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు ఓ కారులో దంపతులు ప్రయాణిస్తున్నారు. ఈ కారు స్థానిక 14వ మైలు రాయి వద్దకు చేరుకోగానే అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న దంపతులకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు కారులో ఉన్న వారిని బయటకు తీశారు. వారిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవింగ్చేసే వ్యక్తి నిద్రమత్తులోకి జారడమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 3 నుంచి జూన్ 2వ తేదీ వరకు క్రికెట్ కోచింగ్ శిబిరాలను నిర్వహించనున్నామని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలు మాత్రమే సమ్మర్ క్యాంప్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోచింగ్ శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని సీ–బ్లాక్లో ఉన్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానంలో శిక్షణ పొందాలనుకునేవారు 91779 91616, అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో 93934 44279, జగ్గయ్యపేటలో 93469 68443, నూజివీడులో శిక్షణ పొందాలనుకునేవారు 73863 47777 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.


