ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. నవీముంబైకి చెందిన జి.హరికృష్ణరెడ్డి, ఆశాకృష్ణ దంపతులు అమ్మవారి వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ. 1.16 లక్షలు, ఆలయంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ వితరణకు రూ. 23 వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
అన్నదానానికి రూ. లక్ష విరాళం
పాలకొల్లు దిగమర్రుకు చెందిన అన్నం వంశీకృష్ణ, కిన్నెర దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో 439 చెరువులున్నాయని.. ఇవన్నీ నిండితే 10 టీఎంసీల నీటిని పట్టి ఉంచొచ్చని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వీటి సామర్థ్యం 6.4 టీఎంసీలుగా ఉందని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు జలధార కింద వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఫీడర్ చానళ్లు, చెరువుల్లో పూడికతీతతోపాటు వివిధ పనుల చేపడుతున్నారన్నారు. రీచార్జి పిట్స్, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం పాత జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్లూయిస్ మరమ్మతులు, ఫీడర్ ఛానళ్ల అభి వృద్ది వంటివాటిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు
జిల్లాలో వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. మనుషులు, పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, పీ4 కింద మంచి మనసున్న వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బంది ఉంటే 91549 70454 కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయొచ్చని తెలిపారు.


