తిరువూరులో పోటాపోటీగా ధర్నాలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు అధికారులు లేకుండానే కార్యవర్గ ఎన్నిక ఎన్నిక చెల్లదంటున్న అధికారులు
తిరువూరు: తిరువూరు మున్సిపాలిటీలోని మెప్మా టీఎల్ఎఫ్ కార్యవర్గ ఎన్నికలో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య శనివారం హైడ్రామా నడిచింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించేందుకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం పట్టణంలోని 33 మంది సభ్యుల్లో 29 మంది విచ్చేశారు. ఎంపీ వర్గానికి చెందిన కొలికపోగు రామకోటమ్మను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ 26 మంది ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు డెక్కా నవ్యను ఆ పదవికి ప్రతిపాదించారు. ఎంపీ వర్గం మెప్మా కార్యవర్గ ఎన్నికను ఏకపక్షంగా నిర్వహించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆందోళనకు ఉపక్రమించారు. ఎంపీ అనుచరులు ఆయనకు పోటీగా ఆందోళన చేపట్టారు. రామకోటమ్మను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని ఎంపీ వర్గం నినాదాలు చేసింది. తాత్కాలికంగా ఎన్నిక వాయిదా వేయాలని మున్సిపల్ కమిషనర్కు మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు సమాచారమిచ్చినా అధికారులు లేకుండానే మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక చెల్ల దని, మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.


